డీజీపీ మహేందర్రెడ్డి ఇవాళ తన సొంతూరులో పర్యటించారు. డీజీపీగా బాధ్యతలనంతరం తొలిసారి స్వగ్రామం కిష్టాపురానికి(ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం) మహేందర్రెడ్డి వెళ్లారు. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ.. స్థానికులను ఆప్యాయంగా పలుకరించారు డీజీపీ. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ తరహా ప్రతి పల్లెలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామంలోని సీసీ కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెల్తో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ అందుబాటులోకి వస్తుందన్నారు. పోలీసు శాఖలో పూర్తిస్థాయిలో అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 24 గంటల పాటు సేవలందిస్తున్న పోలీసుల సంక్షేమానికి చర్యలు చేపట్టామని డీజీపీ ఉద్ఘాటించారు.