హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఈ పథకం ముఖ్య నిర్వాహకులతో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్య శ్రీ సీఈవో మాణిక్రాజ్ కలిసి సచివాలయంలోని సీ బ్లాక్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం నడుస్తున్న తీరు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాల మీద అధికారులు చర్చించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారులు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ తమ జిల్లాలో పర్యటిస్తున్న బృందాల వివరాలను ప్రతి రోజు పరిశీలిస్తూ, పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రతి రోజు సాయంత్రం కంటి వెలుగు కార్యక్రమం వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.