హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బత్తిని మొగిలయ్యగౌడ్ శతజయంతి సందర్భంగా ఆదివారం వరంగల్ నగరంలోని తూర్పుకోటలో మొగిలయ్యగౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిజాములకు వ్యతిరేకంగా కాకతీయకోటపై ప్రతి ఆదివారం 100 మందితో కలిసి జాతీయజెండా ఎగురవేసి దేశభక్తిని నింపిన మొగిలయ్యగౌడ్ ఇంటిపై 1946 ఆగస్టు 11న దాదాపు 200 మంది రజాకార్లు మారణాయుధాలతో దాడిచేశారు. వారితో వీరోచితంగా పోరాడిన మొగిలయ్య అమరుడయ్యారు. ఆయన జ్ఞాపకార్థం స్వస్థలమైన ఖిలావరంగల్ తూర్పుకోటలో శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కట్టగాని రవీందర్ తెలిపారు.