ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించేందుకు టాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడు ముందుంటుందనే సంగతి తెలిసిందే. అప్పట్లో చెన్నైలో కురిసిన భారీ వర్షాలకి ఎందరో నిరాశ్రయులు కాగా వారికి తెలుగు సినీ హీరోలు అండగా నిలబడ్డారు. నగదు, వస్త్రాలు, ఆహారం రూపంలో సాయం చేశారు. తాజాగా కేరళలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న వారిని ఆదుకునేందుకు మన హీరోలు ముందుకొస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు తదితరులు ఇప్పటికే తమ విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందించగా, తాజాగా ప్రభాస్ పాతిక లక్షల రూపాయలు విరాళం అందించారు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం కేరళలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ కొద్ది సేపటి క్రితం పాతిక లక్షల మొత్తాన్ని కేరళ భాధితులకి అందించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభాస్ నటించిన సాహో చిత్రం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.