మహబూబాబాద్ : భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ కే దామోదర్ రెడ్డి విద్యాలయానికి చేరుకున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిణిని ఆయన ఆదేశించారు. వర్షపు నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్త వహించాలని ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్ పరిసరాలని పరిశీలించి, విద్యాశాఖ అధికారిణికి పలు సూచనలు చేశారు.