వరంగల్ అర్బన్ : స్వచ్ఛ సర్వేక్షణ్(గ్రామీణ)2018లో వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 100 శాతం మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు. బహిరంగ మల, మూత్ర విసర్జనకు వెళ్లకుండా విధిగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి, ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే యుద్ధప్రతిపాదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని జిల్లా ప్రజలకు ఆమ్రపాలి పిలుపునిచ్చారు. కేరళ వరద బాధితుల సహాయం కోసం నవసత్తా విద్యార్థి సంఘం.. నిత్యావసర వస్తువులను సేకరించి కలెక్టర్ ఆమ్రపాలికి అందజేశారు. విద్యార్థి సంఘం నాయకులను కలెక్టర్ అభినందించారు.