ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. 2007లో యోగి విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలకు సంబంధించిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. యోగి విద్వేష ప్రసంగంతోనే గోరఖ్ పూర్ అల్లర్లు చోటు చేసుకున్నాయంటూ అసద్ హ్యాథ్, పర్వేజ్ అనే వ్యక్తులు 2008లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి యోగిని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పర్వేజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. అల్లర్లు జరిగిన సమయంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 11 రోజుల పాటు కస్టడీలో ఉంచారు.