ఢిల్లీ : తెలంగాణ అవసరాలను తీర్చాలని ఎన్ డబ్ల్యూడీఏ సమావేశంలో కోరామని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఇవాళ ఢిల్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పామని తెలిపారు. తెలంగాణ అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన నీటిని తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశామని పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నిరక జలాలు పోగా మిగిలిని నీటిని తీసుకోండని చెప్పారు. తమ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానానికి డీపీఆర్ తయారు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించినట్లు హరీష్రావు చెప్పారు.