నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 75,270 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ఏఈఈ మహేందర్ తెలిపారు. రాత్రి వరకు మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలోని బాలేగావ్ ప్రాజెక్ట్ నుంచి 93వేల క్యూసెక్కుల నీటిని సోమవారం ఉదయం విడుదల చేశారన్నారు. ఆ నీరు ఎస్సారెస్పీలోకి మంగళవారం ఉదయం వరకు చేరుకుంటాయని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, సోమవారం రాత్రి 9 గంటలకు 1073.10 అడుగులు (35.465 టీఎంసీల) నీటిమట్టానికి చేరుకుందని తెలిపారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1055.50 అడుగులు ( 9.656 టీఎంసీల ) నీటి నిల్వ ఉందన్నారు.