హైదరాబాద్ : ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాఠిల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేష్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కే. ప్రసాద్ లతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరి పూర్తి స్థాయి నీటితో జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ కు నీరు విడుదల చేయాలని మంత్రులు తీర్మానించారు.
ఎస్సారెస్పీ కింద కాకతీయ కాలువ, లక్ష్మీకాలువతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్ లోని చౌటుపల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ ల కింద ఆయకట్టు, సరస్వతీ కెనాల్ కాలువ, గుత్ప, ఆలీసాగర్, ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్ట్ ల పరిధిలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 49 టీఎంసీల నీరు ఉందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుందని, ఈ ప్రవాహం మరి కొద్ది రోజలు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు.ప్రాజెక్టు పరిధిలోని కాలువ పరిధిలోని చెరువులను, కుంటలను నీటితో నింపాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. ఎస్సారెస్పీకి ఎగువన వరద నీరు ఏయే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తుందని, వర్షపాతం ఎలా ఉందని మంత్రులు ఆరా తీశారు. ఎగువన ఉన్న విష్ణుపురి ప్రాజెక్టు, అంధురా బ్యారేజి, బలెగాం బ్యారేజి, బాబ్లీ బ్యారేజి నుంచి వరద ప్రవాహం ఎస్సారెస్పీకి చేరుతుందని ఇంజనీర్లు తెలిపారు. వరద నీరు ఎస్సారెస్పీకి చేరతుండటం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.