హైదరాబాద్ : రాష్ట్రంలో బస్తీ దవాఖానాల విస్తరణపై వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, వైద్యారోగ్య శాఖ అధికారులు కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నిజామాబాద్లో 5, కరీంనగర్ పట్టణంలో 5, వరంగల్ పట్టణంలో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామని మంత్రులకు అధికారులు తెలియజేశారు.
అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నదని మంత్రులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడంతో పాటు పట్టణాల్లో బస్తీ దవాఖాన వంటి వినూత్నమైన ఏర్పాట్లతో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.