హైదరాబాద్ : పాఠశాల, కళాశాల బాలికల ఆరోగ్య రక్షణ, పరిశుభ్రత కోసం ఉద్దేశించిన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో వారం రోజుల పాటు 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ఆరు లక్షల మంది విద్యార్థినిలకు ఈ బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూల్స్, గురుకుల, కేజీబీవీ, పంచాయతీరాజ్ పాఠశాలలన్నింటిలో ఈ కిట్లను అందించాలని విద్యాశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. ఈ కిట్స్ లో ఆడపిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులున్నాయన్నారు.
12 నెలలకు సరిపడే విధంగా ఏడాదికి నాలుగుసార్లు ఈ కిట్స్ అందిస్తామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఈ కిట్స్ ద్వారా ఏటా 1600 ఖర్చు చేస్తున్నామని, ఆరు లక్షల మందికి ఏటా 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. ఆడపిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం కేసిఆర్ ఈ పథకానికయ్యే వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.