ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరగనున్న ఔషధాల ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:13 AM

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి ఔషధాల ధరలను 2 శాతం వరకూ పెంచుకునేందుకు అంగీకరించిన కేంద్రం, ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని కంపెనీలను ఆదేశించింది. టోకు ధరల సూచికలో వచ్చిన మార్పుల కారణంగా, పెరిగిన ద్రవ్యోల్బణం మేరకు ఏ మేరకు ధరలను పెంచుతారో తెలియజేయాలని నేషనల్‌ ఫార్మాస్యుటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ కోరింది. ఔషధరంగంలో టోకు ధరల సూచిక గత సంవత్సరం 1.97186 శాతం పెరిగిందని గుర్తు చేసిన వాణిజ్య, పరిశ్రమల శాక ఆర్థిక సలహాదారు, పెరిగే ధరలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు.


కాగా, జాతీయ ఔషధ పాలసీలో భాగంగా, మందుల ధరలను కేంద్రం నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. పలు రకాల రుగ్మతలకు వినియోగించే 875కు పైగా ఔషధాల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. వీటిల్లో రక్తపోటు, మధుమేహం నుంచి క్యాన్సర్‌ రోగాల వరకూ వాడే ఔషధాలున్నాయి. దేశవ్యాప్తంగా ఫార్మా మార్కెట్‌ సుమారు లక్ష కోట్ల రూపాయల టర్నోవర్‌ ను అధిగమించగా, 30 శాతం మార్కెట్‌ పై మాత్రమే డైరెక్ట్‌ ప్రైస్‌ కంట్రోల్‌ అమలవుతోంది.


తగ్గనున్న పెట్రోలు ధరలు... 50 డాలర్ల దిగువకు పడిపోయిన క్రూడాయిల్‌ ధర: అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ క్రూడాయిల్‌ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో క్రూడాయిల్‌ ధర 50 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికాలో చమురు నిల్వలు మరో 50 లక్షల బ్యారళ్లు పెరిగినట్టు ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించడంతో కొనుగోళ్లు మందగించాయని ఇంటర్‌ ఫాక్స్‌ ఎనర్జీ అనలిస్ట్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. యూఎస్‌ లో ఉత్పత్తి పెరుగుతుండటంతో, పతనమవుతున్న ధరలను నిలపాలంటే, ఒపెక్‌ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వుందని అన్నారు. 


కాగా, ప్రస్తుతం మేలో డెలివరీ అయ్యే బ్యారల్‌ క్రూడాయిల్‌ ధర 49.71 డాలర్లుగా ఉంది. నవంబర్‌ 30 తరువాత ముడి చమురు ధర ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ ప్రభావంతో భారత క్రూడ్‌ బాస్కెట్‌ ధర కూడా తగ్గనుండటంతో పెట్రోలు, డీజెల్‌ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయి.


రూ.350 తగ్గిన బంగారం ధర: కొన్ని రోజులుగా పసిడి ధర పైకి ఎగబాకుతూ మళ్లీ కిందకు పడుతూ వస్తోంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.29,350కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు బంగారం ధర పది గ్రాములకు రూ.350 తగ్గి రూ.29,000గా నమోదైంది. అంతర్జాతీయంగా ఈ రోజు నెలకొన్న పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడమే బంగారం ధర తగ్గడానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే, పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి రూ.200 తగ్గి రూ.41,250గా నమోదైంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com