హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత కుమారుడిపై చోరీ కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి బి.శ్రీనివాస్ గురువారం సాయంత్రం తన కుమారుడితో కలసి ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లోకి స్విమ్మింగ్ కోసం వచ్చారు. పర్సు పక్కనపెట్టి స్విమ్మింగ్ చేస్తుండగా చోరీకి గురైంది. అందులో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలున్నాయి. చోరీ అయిన గంటలోనే యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి రూ. 1.82 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ. 27,600 మొత్తం సుమారు రూ. 2.09 లక్షలు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ కుమారుడు, చిల్లర వరుణ్ కుమార్ అకౌంట్లోకి ఈ డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా వరుణ్ కుమారే పర్సు చోరీ చేసినట్లు వెల్లడైంది.