ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:45 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధి: బియ్యం అక్రమ రవాణాపై 3 నెలల్లో ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పౌరసరఫరాలు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. సీవీ ఆనంద్‌ సైబరాబాద్‌ సీపీగా ఉన్న సందర్భంలో బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరించారు. మేం రిపోర్టు పంపగానే వెంటనే స్పందించేవారని,  ఆయనే మన కమిషనర్‌గా రావడం సంతోషకరమైన విషమని ఈటల అన్నారు. నేడు నగరంలో జరిగిన పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2017 రబీ యాక్షన్‌ ప్లాన్‌పై జాయింట్‌ కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ సంస్థతో సంబంధం ఉన్న వారందరూ ఆత్మగౌరవంతో పనిచేయాలి తప్ప మంత్రులు, అధికారుల ముందు చేతులు కట్టుకొని ఉండవద్దన్నారు. గతంలో రాజకీయ నాయకుల నుండి కేసులు ఎత్తివేయాలని అధికారులపై ఒత్తిడి ఉండేది..కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో జేసీలకు, అధికారులకు మా వైపు  నుండి ఒక్క కేసు కూడా ఎత్తివేయమని ఒత్తిడి తేలేదన్నారు. ఒక మంత్రి చెబితేనో, ఒక వ్యక్తి చేస్తేనో ఈ వ్యవస్థ ప్రక్షాళన కాదు..మనందరం కలిసి పనిచేయడం వల్ల 80శాతం స్ట్రీమ్‌లైన్‌ అయిందన్నారు.


2కోట్ల 74లక్షల మందికి బియ్యం అందిస్తున్నం. కానీ కోటి 90 లక్షల మందినే కేంద్రం బీపీఎల్‌గా గుర్తించిందన్నారు. తినే వాళ్లందరికీ బియ్యం ఇవ్వాలని ఈటల పేర్కొన్నారు. రేషన్‌ కార్డును ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీలకు ఉపయోగించవద్దని ఎప్పుడో జీవో ఇచ్చినం. కానీ అది ఇంప్లిమెంట్‌ కావడం లేదన్నారు. తినే వారే బియ్యం తినండి అని ప్రచారం చేద్దామని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. ఈ-పీవోఎస్‌ మిషన్‌ల ద్వారా క్రమబద్దీకరణ అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డులు తగ్గించడం అంటే పేదవాడికి బియ్యం రాకుండా ఆపడం కాదు..అమ్ముకునే వారిని అడ్డుకోవడమన్నారు. అవసరమైన వారికి ఎప్పటికపుడు కొత్త కార్డులు ఇవ్వాలని అధికారులకు నిర్దేశించారు. ఒకే డీలర దగ్గర ఎక్కువ సంఖ్యలో కార్డులుండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త దుకాణాలను ఇస్తాం. అరకిలో బియ్యం కూడా తక్కువ కావద్దని సూచించారు.


పౌరసరఫరాల శాఖ కార్పోరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రబీ పంటను ఇక నుంచి మనం యాసంగి పంట అని పిలుచుకుందామన్నారు. మిషన్‌ కాకతీయ ఫలితాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. చెరువులు నిండకుండలా ఉన్నాయన్నారు. ఈ సారి 37లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రానుందని అంచనాలున్నాయని తెలిపారు. మనం ఎక్కువ కష్టపడదాం. ఈ సీజన్‌ అధిగమిస్తే ఒక చరిత్రనే. ఇంత ధాన్యం గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. రైతులు దగ్గరుండి ధాన్యం సరైన సమయంలో సేకరించాలని సూచించారు. కార్పొరేషన్‌కు అప్పులున్నా, కష్టాలున్నా..రైతులకు మాత్రం మంచి ధర అందించాలన్నారు. గత సీజన్‌లో అన్ని జిల్లాలో అధికారులు బాగా పనిచేశారు. అదే స్పూరితో ఈ యాసంగికి కూడా సంస్కరణలు చాలా ముఖ్యమన్నారు. మంత్రి గారు, కమిషనర్‌గారు చాలా సంస్కరణలు తీసుకువచ్చారు. సమస్యలున్నా అన్నింటినీ అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సివిల్‌ సైప్లె శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, సివిల్‌ సైప్లె కార్పోరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీఆర్‌వో బాల మాయాదేవితోపాటు జాయింట్‌ కలెక్టర్లు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com