మంగళూరు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్వరలో కర్ణాటకలోని కదళి (కద్రి) జోగి మఠం, ఉడిపిలోని ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ మఠం సందర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. 2016లో మంగళూరులోని కదళి జోగి మఠంలో జరిగిన మహారాజ పట్టాభిషేకం కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అథితిగా హాజరైనారు. ఆ సమయంలో ఓ దేవాలయం ప్రధాన అర్చకుడిగా యోగి ఆదిత్యనాథ్ మంగళూరుకు వచ్చారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ ను సన్మానించాలని కదళి జోగి మఠం నిర్వహకులు నిర్ణయించారు. వచ్చే ఆదివారం కదళి జోగి మఠం వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించామని, ఆయన తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరౌతారని కదళి జోగి మఠం పరిపాలన విభాగం కమిటీ ఉపాధ్యక్షుడు కేశవానంద ఒన్ ఇండియా (కన్నడ)కు చెప్పారు.