ఉత్తర ప్రదేశ్లో మాంసం వ్యాపారులు తమ ఆందోళన ఉధృతం చేశారు. అక్రమ కబేళాల పేరుతో యోగి సర్కార్ తమను వేధిస్తోదంటూ సమ్మెకు దిగారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మందికి ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులివ్వకుండా షాపులను మూసెయ్యడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యోగి సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గోవధ సహా జంతువుల వధను దేశవ్యాప్తంగా నిషేధించాలని యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ అన్నారు. కేరళ, బెంగాల్లో గోవధకు చట్టబద్ధత ఉందని, దేశ వ్యాప్తంగా ఒకే రకమైన విధానం ఉండాలన్నారు. లక్నో, అలహాబాద్, గోరఖ్పూర్, మురాదాబాద్ లో సమ్మె ప్రభావం స్పష్టంగా కన్పించింది. ఉదయం నుంచే మాంసం వ్యాపారులు ఆందోళనలో పాల్గొన్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో మీట్ షాపులు మూతపడ్డాయి. దాంతో మాంసం ప్రియులు, హోటళ్ల నిర్వాహకులకు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు, యూపీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. అనుమతిలేని కబేళాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. తమ ప్రభుత్వం ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదని, కోర్టు ఆదేశాల మేరకే చర్యలు చేపట్టామని తెల్పింది.