ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి గాలం.. యువతి మాయాజాలం

Telangana Telugu |  IANS  | Published : Wed, Apr 12, 2017, 10:39 AM

హైదరాబాద్‌ : పేరు శ్రీలత...సొంతూరు చిత్తూరు జిల్లా మదనపల్లి... చదివింది పదో తరగతి. మోసాలకు పాల్పడితేనే డబ్బు సంపాదించొచ్చని భావించింది. వెంటనే సుస్మిత పేరుతో అందమైన యువతి చిత్రాన్ని ఓ మ్యాట్రిమెనీలో ఉంచింది. తనకు పెళ్లి కాలేదని.. హైదరాబాద్‌, బెంగళూరులో రూ.కోట్ల విలువైన ఆస్తులున్నాయని తెలిపింది. పెళ్లి చేసుకుంటామంటూ వచ్చిన వారి నుంచి కేవలం 50 రోజుల వ్యవధిలో రూ.6.3 లక్షలు స్వాహా చేసింది. బాధితుల ఫిర్యాదుతో 20 రోజుల క్రితం సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఈమెను అరెస్ట్‌ చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరొకరూ ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. తల్లిదండ్రులకు దూరంగా బెంగళూరులో ఉంటున్న శ్రీలత మ్యాట్రీమోనిలో తన వ్యక్తిగత వివరాలను ఘనంగా ప్రకటించుకుంది. తండ్రి సింగపూర్‌లో గ్రానైట్‌, బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని పేర్కొంది. అంతర్జాలంతో వీటిని చూసిన ముగ్గురు హైదరాబాద్‌ యువకులు ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. తన తల్లిదండ్రులు అంగీకరిస్తే మే నెలలో వివాహం చేసుకుందామని వేర్వేరుగా ముగ్గురికీ చెప్పింది. అనంతరం వారితో రోజూ సంభాషిస్తూ.. పెళ్లైయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పింది. బాధితుల్లో ఒకరు కర్ణాటక రాష్ట్రవాసి కావడంతో, అతడితో కన్నడలో మాట్లాడుతుండేది. పెళ్లిచూపుల కోసం తేదీని నిర్ణయించుకున్నాక స్వాహాపర్వం ప్రారంభించింది. తన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఫోన్‌, పర్సు పోయాయని... అత్యవసరంగా రూ.30 వేలు తన ఖాతాలో జమ చేయాలంటూ అభ్యర్థించింది. మరికొన్నిసార్లు తన తండ్రి సింగపూర్‌ నుంచి డాలర్లు పంపించాడని...వాటిని మార్చుకునేందుకు వీల్లేనందున రూ.50 వేలు పంపిస్తే గంటలో అంతర్జాలం ద్వారా పంపుతానంటూ వేడుకొంటూ రూ.లక్షలు తన ఖాతాలోకి వేయించుకుంది. సరిగ్గా పెళ్లిచూపుల తేదీకి ముందురోజు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుంది. దీంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు.


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు టోపీ 


శ్రీలత అలియాస్‌ సుస్మిత వివరాలను బహుళజాతి సంస్థలో పని చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చూశాడు. జనవరి 30న ఫోన్‌లో మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో ఓ బంగళా, చిత్తూరు జిల్లాలో పెద్ద ఇల్లు ఉందని... బెంగుళూరులోనూ విల్లా ఉందని వివరించింది. వాటి ఫొటోలనూ పంపింది. నమ్మిన యువకుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి రెండో వారంలో అత్యవసరంగా డబ్బు అవసరమంటూ చెప్పగా రూ.50 వేలు పంపించాడు. తన సోదరుడు చనిపోయాడని... ఇదే సమయంలో తన తండ్రికి గుండెపోటు రాగా చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో రూ.1.2 లక్షలు బ్యాంకు ఖాతాలో వేశాడు. సోదరుడు చనిపోయాడని శ్రీలతను పరామర్శించేందుకు మార్చి తొలి వారంలో చిత్తూరుకు వెళ్లి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. మరుసటి రోజు శ్రీలత తల్లినంటూ ఒక మహిళ గొంతుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫోన్‌ చేసి.. పెళ్లికాకముందే ఇలా ఇంటికి రాకూడదంటూ హితవు చెప్పింది. హైదరాబాద్‌కు వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆమెకు ఫోన్‌ చేయగా, పని చేయడం లేదు. దీంతో అతడు మంగళవారం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఈ వ్యవహారమంతా వివరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com