యాపిల్ సంస్థ తన ఐఫోన్ 7, 7 ప్లస్ స్మార్ట్ఫోన్లకు గాను రెడ్ కలర్ వేరియెంట్లను విడుదల చేస్తున్నట్టు గత నెల ప్రకటించిన విషయం విదితమే. కాగా ఆ వేరియెంట్లు ఇప్పుడు భారత్లో లభ్యం కానున్నాయి. వాటిని కావాలనుకునే యూజర్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇన్ఫిబీమ్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ప్రీ ఆర్డర్ చేయవచ్చు. 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో యాపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ రెడ్ కలర్ మోడల్స్ లభిస్తున్నాయి. 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 7 రెడ్ కలర్ మోడల్ ధర రూ.70వేలు ఉండగా, 256 జీబీ ఐఫోన్ 7 రెడ్ కలర్ మోడల్ ధర రూ.80వేలుగా ఉంది. ఇక ఇదే స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తున్న ఐఫోన్ 7 ప్లస్ రెడ్ కలర్ మోడల్ వరుసగా రూ.82వేలు, రూ.92వేలకు యూజర్లకు లభ్యం కానుంది. కాగా ఈ రెండు మోడల్స్లోనూ ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు. గతంలో వచ్చిన ఐఫోన్ 7, 7 ప్లస్ లలో ఉన్న ఫీచర్లే వీటిలోనూ లభిస్తున్నాయి. అయితే ఈ ఫోన్లను ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికి ఈ నెల 15వ తేదీ నుంచి డెలివరీ కానున్నాయి. యాపిల్ సంస్థ రెడ్ అనే స్వచ్ఛంద సంస్థతో గత 10 ఏళ్లుగా కొనసాగిస్తున్న భాగస్వామ్యానికి సింబల్గా ఈ రెడ్ కలర్ ఐఫోన్లను విడుదల చేస్తున్నారు. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఉపయోగించనున్నారు.