హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. విద్యాసాగర్ రావు సతీమణి కూడా కేసీఆర్ గారు వచ్చారంటూ చెప్పారు. ‘‘విద్యన్నా… విద్యన్నా… నేను కేసీఆర్’’ అంటూ పలుమార్లు విద్యాసాగర్ రావును కేసీఆర్ పలుకరించారు. కేసీఆర్ మాటలు విన్న విద్యాసాగర్ రావు స్పందించారు. కాళ్లు, చేతులు కదిలించారు. కళ్లల్లో కూడా కదలిక వచ్చింది.చికిత్సకు విద్యాసాగర్ రావు బాగా స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. త్వరలోనే కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం వెంటిలేటర్ తొలగించినప్పటికి కొద్దిసేపు స్వతహాగా శ్వాస తీసుకోగలిగారని వైద్యులు వివరించారు. ఇదే తరహాలో చికిత్సను కొనసాగిస్తామని కాంటినెంటల్ హాస్పిటల్ నిర్వాహకుడు గురు రెడ్డి, ఇతర వైద్యులు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.
విద్యాసాగర్ రావుకు చికిత్స అందుతున్న తీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. శాయశక్తుల కృషి చేసి విద్యాసాగర్ రావు త్వరగా కోలుకునేలా చూడాలని కేసీఆర్ అభ్యర్థించారు. విద్యాసాగర్ రావు త్వరలోనే కోలుకుని యధావిధిగా జీవితం గడపగలుగుతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి వెంట ఎంపీలు వినోద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు వున్నారు.