వ్యవసాయ శాఖ పద్దతి మారాలన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో రైతుహిత పేరుతో హైటెక్స్ లో వ్యవసాయ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. అధికారులు రైతుల భాషలోనే మాట్లాడాలన్నారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమేనని…దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. క్రాప్ కాలనీలుగా తెలంగాణలోని పంట భూములను విభజిస్తామని చెప్పారు. రాష్ట్రం 21 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు.ఇది వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 20వేల కోట్ల గ్రోత్ సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ శాఖలో అధికారుల నియామకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయం అభివృద్ధికి అదనంగా 500 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమిస్తామన్నారు. నియామక ప్రతిపాదనలు ఇస్తే..వెంటనే అంగీకరిస్తానన్నారు. వ్యవసాయ అధికారులకు ల్యాప్ టాప్ ఇస్తామన్నారు. లక్ష్యాన్ని నిర్దేశిస్తానన్న సీఎం..అమల్లోకి తీసుకు రావాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. వ్యవసాయ అధికారులకు వడ్డీలేని వాహన రుణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. అయితే అవినీతికి తావులేకుండా ఏఈఓవోలు చర్యలు తీసుకోవాలన్నారు.అంతేకాదు గ్రామాల్లో ఎంత రెవెన్యూ భూమి ఉన్నది గుర్తించాలని అధికారులకు సూచించారు. ఏరైతు పేరుతో ఎంత భూమి ఉందో లెక్కలు తేల్చాలన్నారు.రైతుల అడ్రస్, సెల్ నెంబర్ తో సహ అన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు…సర్వే నెంబర్ ఏంటి ..ఎంత భూమి ఉన్నది తెలుసుకోవాలన్నారు. ఈ వివరాలన్నీ జూన్ 10 నాటికి రికార్డు చేయాలని సూచించారు.