తాము బలహీనంగా ఉన్న ఐదురాష్ర్టాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా తలపెట్టిన యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మొదట మిషన్ బెంగాల్ మొదలుపెట్టారు. పశ్చిమబెంగాల్లో కొన్నేండ్ల నుంచి నక్సల్స్ ప్రాబల్యం అత్యధికంగా ఉన్న నక్సల్బరీ జిల్లాలోని టినై గిరిజన గ్రామం దీనికి వేదికగా నిలిచింది. పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరందరూ గర్జించండి ఆ అరుపును కోల్కతా వినాలి అంటూ ఉత్సాహపరిచారు. హింసను అభివృద్ధి ఓడిస్తుందని, హింస చెలరేగినచోట కమలం వికసించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. పర్యటనలో అమిత్ షా టినై గ్రామంలోని ఓ గిరిజన గుడిసెలో సంప్రదాయ భోజనం చేశారు. తమ ఇంటికి వచ్చిన అతిథికి దంపతులు అరటాకు వేసి అన్నం, పప్పు, రొట్టెలు వడ్డించారు.