వరంగల్ : ప్రభుత్వ నియమ, నిబంధనలను అందరూ గౌరవించాల్సిందేనని, ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదని నగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. 27నాటి టీఆర్ఎస్ సభ కోసం నగరంలో ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు నగరంలో కొన్ని ప్రాంతాల్లో డివైడర్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలకు గులాబీ జెండాలు కట్టారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించిన మేయర్ వెంటనే మహానగర పాలక సంస్థ సిబ్బంది అధికారులకు తొలగింపు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్తో కలిసి తానే స్వయంగా జెండాలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించడంలో తామే ఆదర్శంగా ఉండాల్సి ఉందన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకే జెండాలు తొలగించామని వెల్లడించారు.