హైదరాబాద్: దుర్గంచెరువు సమగ్రాభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టీ. రామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుర్గం చెరువును హైదరాబాద్ లాండ్ మార్క్ గా తీర్చిదిద్దుతామన్నారు. చెరువు అభివృద్దిలో భాగంగా వేలాడే వంతెనతో పాటు సుందరీకరణ పనులు చేపడుతున్నారు. దుర్గం చెరువుపై ఆధునిక టెక్నాలజీతో వేలాడే వంతెన నిర్మాణం పనులకు ఇదివరకే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఎల్ అండ్ టీ సంస్థకు పనులు దక్కాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నేల పరీక్షలు తదితర సర్వేలు కొనసాగాయి. ఈ వంతెనను రూ. 184 కోట్ల అంచనా వ్యయంతో 365.85 మీటర్ల పొడవు, ఇరువైపులా తొమ్మిది మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ వంతెన వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు హైటెక్సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. దీంతో పాటు మరో రూ. 3.5కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు కూడా చేపడుతున్నారు. మొత్తం కలిపి దుర్గం చెరువుపై వంతెన నిర్మాణం సహా సుందరీకరణకు రూ. 187.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.