ఏలూరు/పెదవేగి : త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారానంతరం శ్రీలంక నుంచి అయోధ్య చేరడానికి ముందు మార్గమధ్యమంలో బ్రహ్మ హత్యా దోషనివారణార్థం మహాస్థలాలను ఎన్నుకుని ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేస్తూ వెళతాడు. అందులో భాగంగా తమ్మిలేరు ఒడ్డున శ్రీరాముడు బలివేలో ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేశారని ప్రతీతి.అనంతరం బలివే రామలింగేశ్వరస్వామితో పాటు చుట్టుపక్కల నూటొక్క లింగాలు ప్రతిష్ఠింపజేస్తామని శ్రీరాముడు చెప్పినట్టు పురాణగాధ. ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించినట్లుగా చరిత్ర. అందుకే ఈ ప్రాంతానికి బలివేగా, ఇక్కడ వేంచేసిన స్వామిని బలివే రామస్వామిగా పిలుస్తారు. 101 శివలింగాల్లో ప్రస్తుతం 4, 5 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో ప్రముఖమైనది మృత్యుమల్లేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తాతగుడి అం టారు.రామలింగేశ్వరస్వామి కళ్యాణానంతరం రధోత్సవంనాడు తాతగుడికి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు తీసుకునే సంప్రదాయం ఉంది. బలివే రామలింగేశ్వరస్వామి పశ్చిమకు అభిముఖంగా ఉండడం విశేషం.ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ స్వామి సమీపంలో తమ్మిలేరులో ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి పూర్వీకులకు పిండప్రధానం చేసి, పితృతర్పణాలు వదలడం ఆనవాయితీ.