ఫార్మాసిటీ మొదటిదశను ఎనిమిదివేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్కు ఫార్మా పరిశ్రమకు హబ్గా ఇప్పటికే మంచి పేరుందని, ఆ పేరు నిలుపుకుంటూనే భవిష్యత్తులో మరింత ముందంజ వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో ఫార్మాఎక్సెల్ ఆధ్వర్యంలో కేంద్ర వాణిజ్యశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఐఫెక్స్-2017 ఫార్మా, మెడికల్ ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. 14వేల ఎకరాల్లో ఫార్మాసిటీని దశలవారీగా ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో జీరో లిక్విడ్ డిశ్చార్జి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రిట్మెంట్ ప్లాంట్ల సౌకర్యాలు ఉంటాయన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఏ కంపెనీ కూడా ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఫార్మాసిటీ పర్యావరణ అనుమతులకు ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేశామని.. త్వరలో వస్తాయని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. మొదటి దశ ఫార్మా సిటీలో లెర్నింగ్, ప్రాక్టిస్ విధానంలో అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.