‘బాహుబలి-2:ద కన్ క్లూజన్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లన్నింటినీ ఆక్రమించేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 90 శాతం సినిమా ధియేటర్లలో ఈ సినిమాయే ప్రదర్శితమవుతోంది. అయినప్పటికీ తొలి రోజు తొలిషో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానుల మధ్య సినిమా చూసేందుకు ‘బాహుబలి-2:ద కన్ క్లూజన్’ చిత్రయూనిట్ తో పాటు ఈ సినిమా దర్శకుడు రాజమౌళి హైదరాబాదులోని కూకట్ పల్లిలోని శ్రీ భ్రమరాంబ థియేటర్ కు వెళ్లాడు. టికెట్ల కోసం అభిమానులు బారులు తీరగా, వచ్చిన చిత్ర యూనిట్ ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. లైన్ నుంచి పక్కకి వెళ్తే టికెట్ దొరకదు..ఈ సినిమా రూపకర్త కళ్ల ముందునుంచి వెళ్లిపోతున్నాడు. దీంతో కొందరు అభిమానులు రాజమౌళి వద్దకు పరుగుపరుగున వెళ్లి చేయికలిపారు. రాజమౌళితోపాటు ఆయన భార్య రమ, హీరోయిన్ అనుష్క, కీరవాణి దంపతులు, సినిమాటోగ్రఫర్, పీవీఆర్ సంస్థల యజమాని పెరల్ వి ప్రసాద్, ఇతర చిత్ర బృంద సభ్యులు ఉన్నారు.