కరీంనగర్ : మూడేళ్లలో రాష్ట్రంలో ఇల్లు లేదని చెప్పేవారు ఉండరు. ప్రతి కుటంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. పదేండ్ల క్రితం వైఎస్ఆర్ ప్రకటన ఇది. అందుకు అనుగుణంగానే అప్పటి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి మూడు విభాగాలుగా విభజించింది. ఇందులో భాగంగా దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు, మధ్యతరగతి వారికి రాజీవ్ గృహకల్ప పేర అపార్ట్మెంట్లు, పై తరగతి వారికి సొంత ఇంటి నిర్మాంణంలో భాగంగా ఇందిరమ్మ స్వగృహ పథకాలను ప్రవేశపెట్టింది. రాజీవ్ స్వగృహ విషయంలో కరీంనగర్జిల్లా కేంద్రంలో పరిశీలిస్తే... నగరానికి 13కిలో మీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణాపూర్ కాలనీని ఎంపిక చేశారు. 90 ఎకరాల భూమి సేకరించారు. స్వగృహ ఇల్లు కావాల్సిన వారు ఒక్కొక్కరు రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రకటించారు.ఈ మేరకు 500 మంది స్పందించి డిపాజిట్ చేశారు. ఏండ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తాము చెల్లించిన సొమ్ము వాపస్చేయాలని భాధితులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 90మందికి తిరిగి ఇచ్చారు. మిగిలిన 410 మంది 8 ఏండ్లుగా నానా యాతన పడుతున్నారు. 2008 డిసెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్వగృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 500 మంది డిపాజిట్లు చెల్లించిన అనంతరం గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. అవి పునాదుల్లోనే ఆగిపోయాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్న స్వగృహ కార్యాలయాన్ని ఇండ్ల నిర్మాణం తలపెట్టిన రామకృష్ణకాలనీకి తరలించారు. ఇప్పుడు అక్కడ ఆ కార్యాలయానికి సంబంధించిన బోర్డు మినహా అధికారులు మాత్రం ఏ ఒక్కరు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వగృహ బిచానా ఎత్తెసింది. దీంతో కార్యాలయం గోడలపై ఉన్న ఫోన్ నెంబర్కు భాధితులు పోన్ చేసినా స్పందనా కరువైంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో 410 కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందుకు సంబంధించి నాలుగు నెలల క్రితం గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రం గృహ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా భాధితులు తమ గోడు వె ల్లబోసుకున్నారు. ఒ వైపు నిర్మాణాలు ప్రారంభించక పోగా మరోవైపు చెల్లించిన సొమ్మ అయినా వాపస్ చేయాలని కోరారు. గ్రామస్తులు మాత్రం ఐటిహాబ్ ఏర్పాటు చేయాలని అన్నారు. చివరకు స్వగృహ సాగుతుందా.. పునాదులతోనే సమాధి అవుతుందా.. తెలియని పరిస్థితి నెలకొంది.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రాష్ర్టంలో నిలిచి పోయినా రాజీవ్ స్వగృహా నిర్మాణాలను చేపట్టి లబ్దిదారులకు అందించాలని పలువురు కోరుతున్నారు. ఈ పథకం పేరును మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నూతన పథకం క్రిందికి తీసుకువచ్చి ఇళ్లు లేని నిరుపేదలకు ఇండ్లు అందించాలని ఆశీస్తున్నారు.కాగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్బెడ్ రూం పథకం క్రింద గతంలో నియోజకవర్గానికి 400ల చొప్పున ఇండ్లను మంజురు చేసింది. తాజాగా నియోజ కవర్గానికి మరో వెయ్యి ఇండ్లనుకూడా మంజురు చేస్తు ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలోకి రాజీవ్ స్వగృహ లబ్దిదారులను తీసుకుని వారికి కూడా డబుల్బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తే బాగుటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఇకనైనా ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిదులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్దిదారులకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.