హైదరాబాద్: పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు నిర్ధేశించారు. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టుగా 25 పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు రహదారి నిర్మాణం ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. అర్హులైన ఒంటరి మహిళలందరికీ పింఛను అందేలా చూడాలన్నారు. ఎండల తీవ్రతల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరం మేరకు మెడికల్ కిట్లు, మంచి నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.