రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా ఉపాధి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.ఇప్పటికే దీనికి సంబంధించి క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశామని కమిషనర్ నీతూ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నీడకోసం 2 లక్షల 16 వేల టెంట్లను, 3 లక్షల 2 వేల మెడికల్ కిట్లను కూడా కూలీల కోసం అందుబాటులో ఉంచినట్లు ఆమె వివరించారు. అలాగే ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లను కూడా పనులు జరుగుతున్న ప్రదేశంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో మంచినీటి కోసం ఒక్కో కూలీకి చెల్లించే రెండు రూపాయల 50 పైసలను ఐదు రూపాయలకు పెంచినట్లు కమిషనర్ తెలిపారు. కూలీ సమయాన్ని కూడా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకే చేపడుతున్నామన్నారు. వేసవి కాలంలో అదనంగా 30 శాతం వేతనాన్ని కూడా కూలీలకు చెల్లిస్తున్నామన్నారు. ఇంకా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కృష్ణారావు ఆదేశించారు.