భవన నిర్మాణానికి సంబంధించి 15 శాతం పనులను సగర, ఉప్పర కులాలకే ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సగర, ఉప్పర కుల సంఘాల నేతలు మంత్రులు ఈటెల, జోగు రామన్నను కలిశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రులకు ఘన సన్మానం చేశారు.సమాజ నిర్మాణంలో సగరులు, ఉప్పరుల పాత్ర ఎంతో ఉందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వారికి చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీనిలో భాగంగానే భవన నిర్మాణానికి సంబంధించి 15 శాతం పనులను సగర, ఉప్పర కులాలకే కేటాయించామన్నారు. వారికి ఆర్థిక చేయూత కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అటు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర సగర ఉప్పర సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. ఎస్సీ, ఎస్టీ, వడ్డెరలతో సమానంగా ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బాగు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని సగరులు, ఉప్పరులు అన్నారు.