హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సగర, ఉప్పర కులస్తులు మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రులు ఈటల, జోగురామన్నను కలిశారు. ప్రభుత్వం నిర్మించే భవన నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెరులతో సమానంగా తమకు కూడా 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల సగర, ఉప్పర కులస్తులు మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ తెలంగాణలో అన్ని కులాలు అభివృద్ధి చెందాలనేదే సీఎం ఆశయమని స్పష్టం చేశారు. సగర, ఉప్పర కులస్తులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్సీ, ఎస్టీ, వడ్డెరలతో సమానంగా 15 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు వెల్లడించారు. త్వరలో వీరికి ఆర్థిక పరమైన వెసులుబాటు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నరని పేర్కొన్నారు.