హైదారాబాద్: తెలంగాణలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు.. తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం..జూన్ ఒకటవ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ గాంధీ బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అటు నుంచి రోడ్డు మార్గంలో సంగారెడ్డికి బయలుదేరుతారు. దారి మధ్యలో సోమాజీగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రాహుల్ నివాళులర్పిస్తారు. ఆ తరువాత సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో జరుగనున్న తెలంగాణ ప్రజాగర్జనలో పాల్గొంటారు. సభలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలను చార్జ్ షీట్ రూపంలో ప్రజలకు తేలియజేస్తారు’. రాహుల్ సభకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు జనాలు వస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సభకు హాజరుకావాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.