కొలంబో: ప్రకృతి ప్రకోపానికి శ్రీలంక అతలాకుతలమైంది. కనీవినీ ఎరుగని రీతిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో విలయ తాండవం చేస్తోంది. శ్రీలంకలో ముంచెత్తుతున్న వరదల్లో మృతుల సంఖ్య 164కు పెరిగింది. కాగా.. మరో 111 మంది ఆచూకీ తెలియరాలేదు.శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదలపై శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దాదాపు 2వేల మంది సిబ్బందితో సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. మట్టిదిబ్బల కింద సజీవసమాధి అయిన మృతదేహాలను వెలికి తీస్తున్నారు.భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం, సహాయక చర్యల్లో ఆటంకాలు తలెత్తడంతో శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ సాయాన్ని కోరింది. వెంటనే స్పందించిన భారత్.. మూడు నౌకల్లో అత్యవసర, సహాయ సామగ్రిని పంపింది. 2003 తర్వాత శ్రీలంకలో ఇంత దారుణంగా వరదలు సంభవించడం మళ్లీ ఇప్పుడే.