వరంగల్: శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని.. వారిని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి సైతం మెచ్చుకున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హన్మకొండలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలో రూ.50కోట్లతో నూతనంగా నిర్మించనున్న నూతన పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, కమాండో కంట్రోల్ భవన నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి నేరాలు తగ్గిస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే అన్ని పోలీస్స్టేషన్లను కార్పోరేట్ ఆఫీసుల మాదిరిగా మారుస్తామన్నారు.శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని పేర్కొన్నారు.