హిమాచల్ ప్రదేశ్ లోని కులులో గుండెపోటుతో హఠన్మరణం చెందిన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఢిల్లీకి తరలించారు. కులు నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చారు. పాల్వాయి డెడ్ బాడీని తీసుకొచ్చిన ఎయిర్ అంబులెన్సులోనే కులు నుంచి ఆయన సతీమణి, మనవరాలు వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సందర్శన కోసం పాల్వాయి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఉంచుతారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కీలక నేతలు పాల్వాయి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలిస్తారు. పాల్వాయి డెడ్ బాడీ తరలింపును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. పాల్వాయి అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ని ఆదేశించారు.