రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారి విషయంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. రెండు రోజులు గడుస్తున్నా.. రెస్క్యూ టీమ్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అత్యాధునిక కెమెరాలకు సైతం పాప ఆచూకీ చిక్కకపోవడం.. 180అడుగుల లోతున బావిలో నీరు ఉండటంతో.. ఆశలు సన్నగిల్లుతున్న పరిస్థితి. బావిలో నీటిని తోడేయడానికి అధికారులు మోటార్లను వినియోగిస్తున్నారు. నీటిని తోడేయడానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. పాప పరిస్థితిపై ఆందోళన నెలకొంది. మరోవైపు రెస్క్యూ టీమ్ సహా ఓఎన్జీసీ, సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ అధికారులు పాపను వెలికితీయడానికి నిరంతరాయంగా పనిచేస్తున్నారు.ఇంకా పేరు కూడా పెట్టని 14నెలల ఆ చిన్నారి కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. క్షణ క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ఈ ఉదంతం చివరికి ఎలాంటి ముగింపుకు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో.. పాప ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.బోరు బావిలో జారిపడ్డ పాప.. ప్రస్తుతం 215అడుగుల లోతున చిక్కుకున్నట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. కాగా, గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పాప బోరు బావిలో పడిపోగా రాత్రి 8 గంటల నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. సాంకేతిక సహాయంతో పాపను బయటకు తీయాలని రోబోటిక్ హ్యాండ్ క్లిప్, చైన్ పుల్లింగ్ టెక్నాలజీ ఉపయోగించినా ఫలితం లేకపోయింది.
సింగరేణి రెస్క్యూ టీమ్ రాకతో పాప బోరు బావి నుంచి బయటపడుతుందని ఆశించినా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో తాడు సహాయంతోను పాపను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవడంతో.. బోరు బావిలో ఉన్న మోటారును బయటకు తీస్తే.. దాని సహాయంతో బాలిక బయటకు వస్తుందని ఆశించారు. కానీ మోటారు మాత్రమే బయటకు రాగా బాలిక మరింత లోతుకు పడిపోయింది.తొలుత 37అడుగుల లోతులో బాలిక చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు.. బోరు మోటారు ప్రయత్నం విఫలం కావడంతో 70అడుగుల లోతున చిన్నారి పడిపోయినట్లు గుర్తించారు. దీంతో నాలుగు హిటాచీలతో బోరుకు సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. గురువారం ఉదయం 11గం. నుంచి తవ్వకాలు మొదలుపెట్టగా.. పెద్ద పెద్ద బండరాళ్లు ప్రయత్నాలను మరింత జటిలం చేశాయి.