ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు త్వరలోనే శుభవార్త వినబోతున్నారు. ఏడో వేతన సంఘం ప్రకారం వారి వేతనాలు పెరగనున్నాయి. ఓ ఆంగ్ల టెలివిజన్ ఛానల్ కథనం ప్రకారం.. అతి త్వరలోనే ఏడో వేత సంఘం చేసిన సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్స్, హెచ్ఆర్ఏలను ఖరారు చేయనుందట. నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్(ఎన్జేసీఏ) కన్వీనర్ గోపాల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం ఈ నెలాఖరుకే ఇది ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు నాయకులు సమావేశమై చర్చించారు. ఏడో వేతన సంఘం చేసిన సిఫారసు కన్నా ఎక్కువగానే హెచ్ఆర్ఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.ఏడో వేతన సంఘం చేసిన సిఫారసులను పరిశీలించిన అశోక్ లావాసా కమిటీ ఈ ఏడాది ఏప్రిల్ 27న తన నివేదికను ఆర్థిక మంత్రిత్వశాఖకు సమర్పించింది. ఈ సందర్భంగా పలు మార్పులను లావాసా కమిటీ ప్రతిపాదించింది. అందరు ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా ఉండటంతో పాటు, ప్రత్యేక విభాగాల వారికీ ఇవి వర్తించేలా ఆ ప్రతిపాదనలు ఉన్నాయి. 7వ వేతన సంఘం సిఫార్సులు అమలైతే సుమారు దేశవ్యాప్తంగా 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.