శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళుతూ, కొత్వాల్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీ ఆగివుండటాన్ని చూసుకోకపోవడం, నియంత్రిత వేగానికన్నా అధిక వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. సోదరుడి మృతితో రవితేజకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కాగా, ఔటర్ రింగురోడ్డుపై గత రాత్రి రవితేజ సోదరుడు భరత్ రాజు ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరుగగా, ఈ విషయాన్ని ఉదయం వరకూ అతని స్నేహితులు రహస్యంగా ఉంచారు. ఉదయం కారు ప్రమాదం గురించిన సమాచారాన్ని ఇతరుల నుంచి తెలుసుకున్న పోలీసులు 10:30 గంటల సమయంలో ఘటనాస్థలికి వెళ్లిన తరువాతే మృతుడు భరత్ రాజుగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్న విషయమై విచారణ జరుపుతామని, రాత్రి ప్రమాదం జరిగితే, ఉదయం వరకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న విషయమై అతని స్నేహితులను ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియాలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది.