న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను చైర్మన్ హమిద్ అన్సారీ ఆమోదించారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల పట్ల సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్న కారణంతో ఆమె మొన్న రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార పక్షం సభలో తనకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వనపుడు రాజీనామా చేయడమే మంచిదని మాయవతి అన్నారు. షహరాన్పూర్లో దళితులపై జరిగిన దాడి ఘటనను ఆమె రాజ్యసభలో లేవనెత్తారు. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. చేతిలో ఉన్న పత్రాలను ఆవేశంగా విసిరేస్తూ ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యురాలిగా మాయావతి పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగియాల్సి ఉంది. ప్రస్తుతం యూపీలో బీఎస్పీకి ఉన్న సంఖ్యాబలం చూస్తే.. ఆమె మళ్లీ రాజ్యసభకు వెళ్లడం అసాధ్యం. మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆమె మళ్లీ రాజ్యసభకు వెళ్లాలంటే కాంగ్రెస్ లేదా తన ప్రధాన ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీ మద్దతు తప్పనిసరి.