హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో, ఐఐటీ సంస్థల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులను మంత్రి జగదీష్రెడ్డి అభినందించారు. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు మంచి విజయాన్ని సాధించారని తెలిపారు. నీట్లో 49 మంది ఎంబీబీఎస్, 23 మంది బీడీఎస్ సీట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఐఐటీ, ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులకు రూ. 50 వేలు, బీడీఎస్ సీట్లు పొందిన విద్యార్థులకు రూ. 40 వేలు ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. మెరుగైన విద్యాప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరుతుందన్నారు.