ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనదైన శైలిలో దూసుకుపోతున్న సబర్వాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 06:15 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో విచారణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్ త‌న సెల‌వుల‌ను సైతం ర‌ద్దు చేసుకున్నారు. డ్రగ్స్ దందాలో సినీ ప్ర‌ముఖులకు సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో విచార‌ణ పట్ట మరింత గోప్యంగా వ్యవహరిస్తున్నారు. విచారణకు హాజరైన సినీ ప్ర‌ముఖుల‌కు సంధిస్తోన్న ప్రశ్నలను కూడా ఆయ‌న బ‌య‌ట‌కు తెలియనివ్వడం లేదు. విచార‌ణలో పాల్గొనే సిట్ అధికారుల‌కు త‌ప్ప మిగతా సిబ్బందికి కూడా ఈ వ్య‌వ‌హారాన్ని తెలియకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
అంతే కాదు సిట్‌ బృందంలోని సభ్యుల్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న వారికి ఎవ‌రెవ‌ర్ని ఏయే అంశాల‌పై ప్ర‌శ్నించాలి, ఎలాంటి సమాచారం రాబట్టాలనే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు. విచారణలో వాస్తవాలు మరుగుపరిచే అవ‌కాశాలు ఉండ‌డంతో వారి నుంచి నిజాలు రాబ‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మైన ఆధారాల‌ను సిద్ధం చేసుకున్నాకే విచార‌ణ ప్రారంభించారు. ఒక్క‌ రోజులో జరిగే విచారణను రెండు, మూడు సెషన్స్‌గా విభజించి ఒక్కో సెషన్‌లో ప్రశ్నించే బాధ్యతను ఒక్కో టీమ్‌కి అప్పగిస్తున్నారు. ఏ బృందంలో ఏ అధికారి ఉంటాడో చివరి నిమిషం వరకు ఎవ్వ‌రికీ తెలియదు. సుమారు 25 మంది అధికారుల‌ను వినియోగిస్తున్నట్లు స‌మాచారం.
విచారణకు హాజరైనవారు గదిలోకి వెళ్లడానికి ముందు ఎంపికచేసిన అధికారులతో అకున్‌ సబర్వాల్ కాసేపు చ‌ర్చిస్తున్నారు. సినీ ప్ర‌ముఖుల‌ను ప్ర‌శ్నించిన అనంత‌రం ఈ వివరాలతో కూడిన ఫైల్‌ను అధికారులు ఆయనకు ఇచ్చి వెళ్తున్నారు. అలాగే తమను ఎవరు విచారిస్తారో తెలుసుకునే అవ‌కాశం కూడా వీరికి లేదు. ఇప్ప‌టికి పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడులను ప్ర‌శ్నించిన అధికారులు ఈ రోజు న‌టుడు సుబ్బ‌రాజును విచారిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో నోటీసులు అందుకున్న మ‌రో తొమ్మిది మందిని విచారించాల్సి ఉంది. వారంద‌రి విచార‌ణ‌ కూడా ఇదే ప‌ద్ధ‌తిలో కొనసాగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa