జూబ్లీహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని పబ్బులో ముజ్రా పార్టీని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. దాడిలో ఆరుగురు యువతులతోపాటు ఒక హిజ్రాను, పదకొండు మంది యువకులను, పబ్ మేనేజర్ పద్మనాభంను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన నజీర్ అనే యువకుడు బంజారాహిల్స్ రోడ్డు నం. 2లోని హైడ్రోజన్ పబ్లో ఒక ప్రైవేటు పార్టీ ఏర్పాటు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు యువతులు, ఒక హిజ్రాతోపాటు పదకొండు మంది యువకులు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. ఇందులో మహ్మద్ ముసాక్, అబ్ధుల్ రహమాన్, వసీం, ఫిర్దోజ్ఖాన్, మహ్మద్ మహీన్, అహ్మద్, సలీం, అహ్మద్ బిన్ అమర్, అబ్ధుల్ ఉస్మాన్, సోహైల్ తదితరులు ఉన్నారు. వీరందరు ముజ్రా పార్టీలో మునిగి తేలుతున్నారు. సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అప్పటికే వారంతా పార్టీలో మునిగితేలుతుండగా పోలీసులు భగ్నం చేశారు. వారందరిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. పబ్ యజమాని పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.