కర్ణాటక ఇంధన మంత్రి డీకే శివకుమార్పై ఐటీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆస్తులు, వ్యాపార సంస్థలు, స్నేహితులు, బంధువుల ఇళ్లపై బుధవారం చేపట్టిన ఆదాయపు పన్నుశాఖ దాడులు శుక్రవారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా మూడోరోజు బెంగళూరు, దిల్లీల్లోని శివకుమార్కు చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీలోని సఫ్దర్గంజ్ ప్రాంతంలో గల మంత్రి నివాసంలో ఈ ఉదయం తనిఖీలు ప్రారంభించారు.
శివకుమార్ నివాసాలు, కార్యాలయాలపై రెండు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. బుధవారం దిల్లీ, బెంగళూరులో మొత్తం 39 చోట్ల ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. గురువారం మరో 23 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు 300 సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొనగా.. ఇప్పటివరకూ మొత్తం రూ. 11.43కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ సన్నిహితుడు, విధాన పరిషత్తు సభ్యుడు రవి నివాసం నుంచి రూ. 22కోట్ల విలువ చేసే ఆస్తిపత్రాలను గుర్తించారు. కాగా.. శివకుమార్ ఇంట్లో 5 లాకర్లను ఐటీ అధికారులు గుర్తించి.. వీటిలో రెండింటిని తెరిచారు. మిగిలిన లాకర్లను తెరిచేందుకు శివకుమార్ ఒప్పుకోకపోవడంతో నిపుణుల సాయంతో తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఐటీ దాడులపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దాడి అని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా.. గుజరాత్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను ఇటీవల బెంగళూరుకు తరలించింది. ఈ ఎమ్మెల్యేల వ్యవహారాలను శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు.