నిజామాబాద్: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం లో భాగంగా పోచంపాడు వద్ద ఇవాళ ఉదయం పథకం పనులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు వరద కాలువ వద్ద ఉన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు. తర్వాత పోచంపాడ్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఆంధ్రా కు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయం లాగా ఉంటే.. తెలంగాణ కు నీళ్లిచ్చే శ్రీరాంసాగర్ శిథిల శివాలయంలా మారింది. "2001 లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జలసాధన ఉద్యమం చేపట్టినం. అప్పుడు ప్రాజెక్టుల రూపు రేఖలు ఎలా ఉన్నాయో కూడా తెలియజేశాం. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నం. నాటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత ప్రాజెక్టులే. 1996 లో ఓసారి శ్రీరాంసాగర్ కట్ట చూడటానికి వచ్చినప్పుడు ప్రాజెక్టు పరిస్థితి చూసి అప్పుడే నిర్ణయం తీసుకున్న. తెలంగాణ ఉద్యమం చేస్తా.. తెలంగాణ సాధిస్తా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రూపురేఖలు మారుస్తా అనుకున్న. నేడు ఆ మాటను నిజం చేసుకున్న. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నా జన్మ ధన్యమైంది అని" అన్నారు. వచ్చే జూన్ నాటికి ఎస్సారెస్సీని కాళేశ్వరం నీళ్లు నింపుతామన్నారు.