ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఘోర ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2017, 11:13 AM

కైరో: ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది.స్థానిక కెనాల్‌ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్‌ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్‌ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 44 మంది మృతిచెందారు. మరో 180 మంది వరకూ గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


సమాచారమందుకున్న రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బోగీల శిథిలాలను తొలగిస్తూ.. ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న రైలు డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌-సిసి విచారం వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com