ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలకోట్ల వారసుడు.. హైదరాబాద్‌లో అజ్ఞాతవాసం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2017, 11:53 AM

వేల కోట్ల రూపాయలకు వారసుడైన ఓ యువకుడు నెల రోజులపాటు అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే..? తనెవరో చెప్పకుండా పరాయి ఊళ్లో.. పొట్ట పోసుకోవాల్సి వస్తే..? సినిమా కథలా ఉన్నా.. జరిగింది నిజమే. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడైన హితార్థ్‌ నెల రోజుల పాటు తానెవరో ఎవరికీ చెప్పకుండా సామాన్యుడిలా హైదరాబాద్‌లో గడిపాడు. రూ. 500 తీసుకొని ఇంట్లో నుంచి వచ్చిన ఈ పాతికేళ్ల కుర్రాడు.. భాగ్యనగరం మురికి వాడల్లో కాలం వెల్లదీశాడు.


గుజరాత్‌‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి అయిన ఘన్‌శ్యాం డోలాకియా కుమారుడే హితార్థ్. ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం వారిది. ఆ కుటుంబ ఆచారం ప్రకారం.. వ్యాపారంలోకి అడుగుపెట్టాలని భావించే వారు ఎవరైనా తప్పనిసరిగా నెలరోజులపాటు తమకు తెలియని ప్రాంతంలో సామాన్యుడిలా బతకాలి. ఇప్పుడు హితార్థ్ చేసింది కూడా అదే. న్యూయార్క్‌లో చదువుకున్న అతడు.. తండ్రి మాట ప్రకారం రూ. 500తో హైదరాబాద్ వచ్చి చిన్నాచితక ఉద్యోగాలు చేసి నెల రోజులు గడిపాడు. రకరకాల ఉద్యోగాలు చేసి కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. తన ఉనికి బయటికి చాటకుండా ఇరుకు గదుల్లో, మురికివాడల్లో జీవనం వెళ్లదీశాడు.


తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి, హితార్థ్ ఫ్యామిలీకి స్నేహం ఉంది. అయితే తన కొడుకు హైదరాబాద్ వచ్చిన విషయాన్ని ఘనశ్యామ్ ఆయనకు తెలియనీయలేదు. నెల రోజులపాటు అజ్ఞాతంలో గడిపాకే.. కుటుంబ సభ్యులు వచ్చి హితార్థ్‌ను కలిశారు. ఏటా పండుగల సమయంలో తన దగ్గర పనిచేసే వారికి కార్లు, ఖరీదైన ఫ్లాట్లు ఇస్తూ వార్తల్లో నిలిచే వజ్రాల వ్యాపారి ఈ సారి తన కొడుకును ఇలా బయటకు పంపి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో హితార్థ్ సోదరుడు కూడా ఇలాగే నెల రోజులపాటు వేరే ఊళ్లో గడిపాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com