హైదరాబాద్: రవీంద్రభారతి లో ఇవాళ లైబ్రేరియన్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఎస్ఆర్ రంగరాజన్ 125 వ జయంతి సందర్భంగా లైబ్రేరియన్ డే చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపించామని.. ఆయన ఆమోదించగానే 010 పద్దు కింద వేతనాలు అందుతాయని మంత్రి హామీ ఇచ్చారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో, తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయాలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించాయన్నారు. టెక్నాలజీ పెరగడం వల్ల పుస్తకాలకు కాస్త ప్రాధాన్యత తగ్గినా... పుస్తకాలకు వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. వాటికి నెలవైన గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.