హైదరాబాద్ : నగరంలోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, హామీల అమలు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరంగా ప్రతి 3 నెలల్లో సాధించనున్న మైలురాళ్లను ముందే తెలపాలని సూచించారు. మైలురాళ్లు అందుకోలేని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. సరళతర వాణిజ్య విధానంలో తొలిస్థానం కొనసాగేలా పని చేయాలని ఆదేశించారు. రాష్ర్టానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులే ప్రతిపాదికగా పని చేయాలని మంత్రి సూచించారు. ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్క్లపై కూడా సమీక్షించారు కేటీఆర్. ఏరోస్పేస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నించాలని చెప్పారు. టాస్క్ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. గతేడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచామని గుర్తు చేశారు. ఎన్విరాన్ మెంటల్ అనుమతులపై పబ్లిక్ హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఫార్మాసిటీ ద్వారా కలిగే ఉద్యోగాలు, లాభాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు.