హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు భారత ఆహార, వ్యవసాయ మండలి నుంచి అరుదైన గౌరవం లభించింది. రైతన్నల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు వరించింది. పాలసీ లీడర్షిప్ కేటగిరీ కింద కేసీఆర్కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్లో అవార్డు ప్రదానం కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు భారత ఆహార, వ్యవసాయ మండలి అవార్డును అందజేయనుంది.
లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్కు ఈ అవార్డు వచ్చింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కృషి చేసే వారికి 2008 నుంచి భారత ఆహార వ్యవసాయ మండలి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన విధానాలు, పథకాల అమలుకు గుర్తింపుగా ఈ అవార్డు కేసీఆర్ కు ప్రకటించినట్లు భారత ఆహార, వ్యవసాయ మండలి స్పష్టం చేసింది.